తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్(TUCI ) ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో ధర్నా
బోధన్ మే 22 : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో శుక్రవారం ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI ) బోధన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి. మల్లేష్ మాట్లాడుతూ కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా 2023లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం చేయూత పథకం ద్వారా బీడీ కార్మికులకు 4,000 రూపాయల బీడీ పింఛన్ వెంటనే ఇవ్వాలంటూ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలో బీడీ కార్మికులతో అంగడి బజారు నుండి సమీకృత మండల కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అవతరణ దినమైనటువంటి జూన్ 2 నుండి కొత్త పెన్షన్లను ఇస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని దాంట్లో బీడీ కార్మికులకు కూడా చేయూత పథకము ద్వారా కట్ ఆఫ్ డేటును తొలగించి అర్హులైన వారందరికీ నాలుగు వేల రూపాయలను పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల బీడీ కార్మికులందరితో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరము డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్చార్జి కి ఇవ్వడం జరిగింది. బీడీ కార్మికుల వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను తీసుకోకపోవడంతో సమీకృత మండల భవన సముదాయం లో బైఠాయించి, ఆందోళన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ బోధన్ ఏరియా కమిటీ నాయకులు శోభ, బుజ్జి, లతా, శంకరమ్మ, లక్ష్మీ, గంగామణితో పాటు అధిక సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.








