సిపిఎం నేతల పిలుపు
బోధన్, మే 19:
బోధన్ మండలం ఏరాజ్పల్లి గ్రామంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ బాలయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ, పుచ్చలపల్లి సుందరయ్య భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానేత అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలోని జమీందార్ కుటుంబంలో జన్మించినప్పటికీ, పేదలు, రైతులు, కార్మికుల పక్షాన నిలిచి జీవితాంతం ప్రజాసేవకే అంకితమయ్యారని తెలిపారు.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ పిలుపుతో ఉద్యమాల్లో పాల్గొన్న సుందరయ్య, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారని చెప్పారు. సిపిఎం పార్టీ తరఫున తొలి ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు.

తన కుటుంబానికి చెందిన 50 ఎకరాల భూమిని పేదలకు పంచిపెట్టి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారని, భార్య లీలావతితో కలిసి వ్యక్తిగత జీవితం కంటే ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చారని వివరించారు. వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులు, అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడటమే సుందరయ్యకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నల్ల సాయిలు, ఆసరి లింగం, ప్రశాంత్, అశోక్, గంగారం, పోశెట్టి, రాములు, డి.సాయమ్మ, జి.పద్మ, ఎస్.స్వరూప, ఎం.గంగవ్వ, ఎస్.లక్ష్మి, ఎస్.సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







