బోధన్, మే 1:
నిజామాబాద్ జిల్లా బోధన్, సాలూరా మండలాలకు ఆనుకుని ఉన్న తెలంగాణ మంజీరా సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా అక్రమంగా చొరబడి ఇసుక తరలిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర బోలేగావ్, గంజిగావ్ ప్రాంతాలకు చెందిన వారు తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించి ప్రతిరోజూ ఇసుకను దొంగలించుకుపోతున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుల సమాచారం మేరకు ఇక్కడ కూలీలతో కాకుండా జేసీబీ యంత్రాల సహాయంతో భారీ ఎత్తున అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రాత్రి, పగలు తేడా లేకుండా నిరంతరం తవ్వకాలు జరిపి వాహనాల్లో ఇసుక లోడింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందజేయగా, రెవెన్యూ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సర్వే చేపట్టి పరిస్థితిని పరిశీలించారు.
అయితే ఈ అక్రమ వ్యవహారంలో కొందరు అధికారులు కూడా కుమ్మక్కై ఉన్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి తవ్వకాల వీడియోలు తీసి బయటపెట్టేందుకు ప్రయత్నించే వారిని బెదిరిస్తూ, దౌర్జన్యాలకు దిగుతున్నారని ప్రజలు వాపోతున్నారు.
మహారాష్ట్రకు చెందిన కొందరు అధికారులు ఇసుక మాఫియా గుప్పెట్లోనే పనిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొందరు తెలంగాణ అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ భూభాగంలోని సహజ వనరులను ఈ విధంగా దోచుకోవడం ఆపాలని, వెంటనే ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






