బోధన్, జూలై 2: గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అత్యంత అవసరమని బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎం. రాజశేఖర్ అన్నారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర మండలంలోని తేగ్గెల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన
“మన ఊరు–మన భద్రత–మన బాధ్యత”కార్యక్రమంలో గ్రామస్థులతో అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ భద్రతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో కీలకమని ఎస్హెచ్ఓ పేర్కొంటూ, సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్, పాస్వర్డ్లు ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేసి పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీట్బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు, విషసర్పాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు. తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, విద్యుత్ లోపాలు గమనిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పాము కాటుకు గురైతే మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు.
గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమావేశంలో గ్రామస్థులు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్హెచ్ఓ ఎం. రాజశేఖర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







