నిజామాబాద్, మే 7: బక్రీద్ పండుగను శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ హాల్లో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రజల సహకారం, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బక్రీద్ వంటి పర్వదినాలను పరస్పర గౌరవం, సోదరభావంతో జరుపుకోవడం సమాజ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. పండుగ సమయంలో ఎలాంటి అపోహలు, వదంతులు వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని, అనుమానాస్పద సమాచారం గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు.
ప్రార్థనా స్థలాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. పండుగ రోజుల్లో ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ముస్లిం మత పెద్దలు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ, శాంతి భద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, బోధన్ ఎస్హెచ్వో వెంకట నారాయణ, బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్ఐలు మనోజ్, హబీబ్, మచ్చేందర్ రెడ్డి, రమ, వంశీకృష్ణ రెడ్డి, చంద్ర మోహన్, మహేష్, సునీల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇలియాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషా తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








