నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని వర్ని వెళ్లే ప్రధాన రహదారిపై జేఎన్సీ కాలనీ సమీపంలో మంగళవారం భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వర్ని వైపు నుంచి వస్తున్న ఒక భారీ గూడ్స్ లారీ, బోధన్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తున్న ఎక్స్ప్రెస్ బస్ను ఎదురెదురుగా ఢీకొన్నాయి.
ప్రమాదం తీవ్రతకు బస్ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. లారీ కేబిన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఢీకొట్టిన ప్రభావంతో రోడ్డుపై వాహనాల ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాద సమయంలో బస్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో కేకలు వేస్తూ గాయపడ్డారు.
ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక ప్రజలు సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని అంబులెన్సు సహాయం తో ఆసుపత్రులకు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం కారణంగా ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదానికి అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Author: IRFAN Reporter
Work from as a journalist







