మన ఇసుక వాహనం’ యాప్ నిలిచిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోవడం
లోడింగ్ ఛార్జీలు వసూలు.. పని మాత్రం వాహనదారులే
ఇసుక లేక లబ్ధిదారుల ఆవేదన – వెంటనే స్పందించాలంటూ డిమాండ్..
బోధన్,:
బోధన్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక పెద్ద సమస్యగా మారింది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న పేద లబ్ధిదారులు ఇసుక దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఇసుక వాహనం’ యాప్ బోధన్ ప్రాంతంలో దాదాపు నిలిచిపోయినట్లే ఉందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇసుక సరఫరాను పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో యాప్ ద్వారా బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పటికీ, అది కేవలం వారం రోజులకే పరిమితమైందని స్థానికులు చెబుతున్నారు. గత పది రోజులుగా యాప్లో బుకింగ్లు జరగకపోవడంతో నిర్మాణ పనులు పునాదుల్లోనే ఆగిపోయాయి. యాప్ ఓపెన్ చేస్తే సాంకేతిక సమస్యలు లేదా స్టాక్ లేదనే సమాచారం మాత్రమే కనిపిస్తోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇసుక లోడింగ్ కోసం వాహనదారుల నుంచి రూ.400 వసూలు చేస్తున్నప్పటికీ, రీచ్ల వద్ద లోడింగ్ సిబ్బంది కనిపించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులే కూలీలను పెట్టుకుని లేదా స్వయంగా ఇసుక లోడింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. “లోడింగ్ ఛార్జీలు మాత్రం వసూలు చేస్తున్నారు.. పని మాత్రం మేమే చేసుకోవాలా?” అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక సరఫరా నిలిచిపోవడాన్ని కొందరు అక్రమ వ్యాపారులు అవకాశంగా మార్చుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కదారి పట్టిన ఇసుకను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ లబ్ధిదారులను దోచుకుంటున్నారని అంటున్నారు. ఇసుక తప్పనిసరి కావడంతో పేద లబ్ధిదారులు వేల రూపాయలు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ‘మన ఇసుక వాహనం’ యాప్ను వెంటనే పునరుద్ధరించి, పారదర్శకంగా ఇసుక సరఫరా చేయాలని, లోడింగ్ ఛార్జీల పేరుతో జరుగుతున్న వసూళ్లను అరికట్టాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని మరియు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....







