బోధన్, జనవరి 23 :
ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే పునఃప్రారంభించి, కార్మికులకు గత 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు, సెటిల్మెంట్, గ్రాట్యుటీ, వీఆర్ఎస్ అమలు చేయాలని నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ గేటు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, 2015 డిసెంబర్ 23 నుంచి ఇప్పటివరకు కార్మికులు వేతనాలు లేక తీవ్ర ఆర్థిక కష్టాల్లో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నడుస్తున్న ఫ్యాక్టరీని మూసివేసి కార్మికులను నిర్లక్ష్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు.
గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఫ్యాక్టరీ మూతపడిందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఫ్యాక్టరీని నడిపించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని విమర్శించారు.
పది సంవత్సరాలుగా ఫ్యాక్టరీని నిరంతరం “లే-ఆఫ్”లో ఉంచడం దేశంలో ఎక్కడా చూడలేదని, లేబర్ చట్టాల ప్రకారం కార్మికులకు రావాల్సిన హక్కులను ప్రభుత్వం, మేనేజ్మెంట్ కలిసి కాలరాస్తున్నాయని ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా రిటైర్డ్ అయిన కార్మికులకు కూడా గ్రాట్యుటీ ఇవ్వకపోవడం అత్యంత శోచనీయమన్నారు.
ఫ్యాక్టరీ మూసివేత సమయంలో ఇచ్చిన ఆఫీస్ ఆర్డర్ ప్రకారం ఎక్స్గ్రేషియా, వీఆర్ఎస్, సెటిల్మెంట్ అమలు చేయాలని, కానీ మేనేజ్మెంట్ దానిని పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంట్ కూడా మౌనం వహించడం కార్మికుల జీవితాలతో చెలగాటమాడటమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే బోధన్ ప్రాంత ప్రజలతో పాటు బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి లభిస్తుందని, ప్రాంత ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని ఫ్యాక్టరీని తెరిపించి, కార్మికులకు రావాల్సిన వేతనాలు, సెటిల్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తమ అనుభవాన్ని ఉపయోగించుకుని మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని, లేకపోతే 2015 డిసెంబర్ 23 నుంచి ఇప్పటివరకు రావాల్సిన బకాయిలతో పాటు వీఆర్ఎస్ మంజూరు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, రవిశంకర్ గౌడ్, బాలకృష్ణ, శ్రీనివాస్, శ్రీధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








