June 8, 2026 12:01 am

V1News Telangana

అర్ధరాత్రి తవ్వకాలకు అనుమతి ఎవరిది? మంజీరా సరిహద్దుల్లో ఇసుక మాఫియా మకాం..?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పహారా పెడతామన్న అధికారులు ఎక్కడ.. తెలంగాణ భూభాగంలోకి చొరబాటుపై తీవ్ర ఆరోపణలు…

సాలూర మండలం, జూన్ 7:

సాలూర మండలం తగ్గెళ్లి గ్రామ సమీపంలోని మంజీరా నదిలో జరుగుతున్న ఇసుక తవ్వకాల వ్యవహారం కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. పగలు మాత్రమే కాకుండా అర్ధరాత్రి వేళల్లో సైతం భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు స్థానికుల్లో ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. అసలు రాత్రి వేళల్లో తవ్వకాలకు అనుమతి ఎవరు ఇచ్చారు? అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
స్థానికుల కథనం ప్రకారం, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చిన క్వారీ నిర్వాహకులు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుకను వెలికితీస్తున్నారని ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో జేసీబీలు, ఇతర భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తూ నదీ సంపదను తరలిస్తున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గతంలో అక్రమ తవ్వకాలపై ప్రత్యేక పహారా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అధికారులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంటే అర్ధరాత్రి వరకు తవ్వకాలు ఎలా సాగుతున్నాయనే సందేహాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలో అనుమతులు పొందిన క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించి తవ్వకాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ఒకవేళ తవ్వకాలు సక్రమమే అయితే సంబంధిత అనుమతులు, సరిహద్దు వివరాలు, కార్యకలాపాల సమయాలను అధికారులు బహిర్గతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంత భారీ స్థాయిలో తవ్వకాలు జరుగుతుంటే అధికారులు గుర్తించలేదా? లేక గుర్తించినా చర్యలు తీసుకోలేదా? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు స్థానిక వ్యక్తులు, మధ్యవర్తులు, సంబంధిత వర్గాలు కలిసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
అక్రమ తవ్వకాల వల్ల మంజీరా నది సహజ స్వరూపం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి, భూగర్భ జలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన సహజ సంపద తరలిపోతుంటే రెండు రాష్ట్రాల అధికార యంత్రాంగం మౌనంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“అర్ధరాత్రి తవ్వకాలకు అనుమతి ఎవరిచ్చారు? అక్రమాలకు అండగా నిలుస్తున్నది ఎవరు? ప్రజల సంపదను కాపాడాల్సిన వ్యవస్థ ఎందుకు స్పందించడం లేదు?” అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


మంజీరా నదిలో జరుగుతున్న తవ్వకాలపై తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అక్రమాలు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more