నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై తీవ్ర ఆరోపణలు వెలువడ్డాయి. ఉపసర్పంచ్ అనుమతి లేకుండానే సర్పంచ్ మరియు గ్రామ కార్యదర్శి కలిసి నిధులను వినియోగించారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన యువకులు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా యువకులు కలెక్టర్ కార్యాలయంలో లిఖితపూర్వక ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. వారి ఆరోపణల ప్రకారం, మార్చి 31న 15వ ఫైనాన్స్ నిధుల కింద వోచర్ నంబర్లు XVFC/2025-26/P10, P11 ద్వారా మొత్తం రూ. 3,36,500 (రూ. 19,500 మరియు రూ. 3,17,000)ను ఉపసర్పంచ్ సంతకం లేకుండానే బిల్లులు పాస్ చేసి చెక్కుల ద్వారా డ్రా చేసినట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం నిధులు విడుదలకు సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్ సంతకం తప్పనిసరి అయినప్పటికీ, ఆ విధానాన్ని విస్మరించి నిధులను వినియోగించడం గంభీరమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు కలెక్టర్ను కోరారు.

Author: IRFAN Reporter
Work from as a journalist








