Post Views: 91
“ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకుంటాం – బోధన్ ఎమ్మెల్యే భరోసా”
. “సాలుర మండలంలో పంట, ఇళ్ల నష్టం పరిశీలన – తక్షణ చర్యలు సూచించిన ఎమ్మెల్యే”
“ముంపు ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి – సుదర్శన్ రెడ్డి”
సాలూర:ప్రకృతి విపత్తు కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులు, ముంపు బాధితులు అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం ఆయన జిల్లా వ్యవసాయ అధికారులు, పలు శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పార్టీ నాయకులతో కలిసి సాలుర మండలంలోని ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో ముంపు ప్రభావిత పంటలను, కూలిన ఇళ్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వరద ముంపు వల్ల పంటలు నష్టపోవడం దురదృష్టకరం. కానీ రైతులు భయపడవద్దు. ప్రభుత్వ సహాయం అందించేలా పూర్తి స్థాయిలో కృషి చేస్తాం” అని తెలిపారు.
వ్యవసాయ అధికారులు గంటల వ్యవధిలో ప్రాథమిక అంచనాలు వేసినందుకు ఎమ్మెల్యే ప్రశంసలు తెలిపారు. ఇప్పటికే నష్టం వివరాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ ఎమ్మెల్యేకు వివరించారు.
అదేవిధంగా విద్యుత్ సమస్యలపై కూడా ఎమ్మెల్యే అధికారులు అడిగి తెలుసుకున్నారు. వరద కారణంగా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని, వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మండల వ్యాప్తంగా రోడ్లు, నీటి పారుదల, పరిశుభ్రత సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మందర్న – సుంకిని రోడ్డును తక్షణమే మరమ్మతు చేయాలని, గ్రామాలలో నీటి సమస్యలు లేకుండా చూడాలని ప్రత్యేకంగా ఆదేశించారు.
ఈ పరిశీలనలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాని, జిల్లా గ్రంథాలయాల సంస్థల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ ఏఎంసీ చైర్మన్ చీల శంకర్, వైస్ చైర్మన్ వసంత్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్ధన్, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








