“అధికారులు వినకపోతే ప్రజల గోడు ఎవరికి చెప్పుకోవాలి?” అంటూ వినూత్న నిరసన.. వెంటనే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్
బోధన్, జూన్ 22 (ప్రతినిధి):
బోధన్ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎంఐఎం పార్టీ నాయకులు, కౌన్సిలర్లు సోమవారం బల్దియా కార్యాలయం ఎదుట వినూత్న నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు టెంట్ ఏర్పాటు చేసి, స్వయంగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్, కమిషనర్ హాజరైనట్లుగా భావిస్తూ వారి కోసం ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేసి, ఆయా వార్డుల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలు, మౌలిక వసతుల కొరత, తాగునీటి ఇబ్బందులు, పెండింగ్ అభివృద్ధి పనులపై ఒక్కొక్కరిగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
అధికారులకు ప్రజల సమస్యలు వినిపించడం లేదని, ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతోనే ఈ విధంగా నిరసనకు దిగాల్సి వచ్చిందని ఎంఐఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు ప్రజల గోడును పట్టించుకోని పాలకవర్గం, అధికార యంత్రాంగం వైఖరిని తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అయితే కౌన్సిలర్లు ప్రస్తావిస్తున్న సమస్యలను అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మున్సిపల్ చైర్మన్, కమిషనర్ స్పందించి అధికారిక కౌన్సిల్ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి, వార్డుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
“ప్రజాప్రతినిధులు ఖాళీ కుర్చీలకు సమస్యలు చెప్పుకునే పరిస్థితి రావడం బోధన్ బల్దియాలో పాలనా వైఫల్యానికి అద్దం పడుతోందని” వారు వ్యాఖ్యానించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







