బయట షట్టర్ డౌన్… లోపల మద్యం సిట్టింగ్లు ఆన్..! ఒకరికి ఒక చట్టం… మరొకరికి మరో చట్టమా?
ఉమ్మడి బోధన్ పట్టణం ప్రధాన రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా – మార్గం, బోధన్ పరిసర హైవే ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలకు మూసివేయాల్సిన కొన్ని ధాబాలు బయటకు షట్టర్లు వేసినట్లు చూపించి, లోపల మాత్రం సిట్టింగ్లు, మద్యం విందులు యథావిధిగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బయటకు మూసివేసినట్టే కనిపించినా, అర్ధరాత్రి తర్వాత కూడా వ్యాపారం సాగుతుండటంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇక పరిధిలో అధికారులు స్పందించి కొన్ని చోట్ల చర్యలు తీసుకున్నప్పటికీ, బోధన్ పట్టణ హైవే పక్కన ఉన్న మరికొన్ని ధాబాలు మాత్రం రాత్రి ఒంటిగంట వరకు నడుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. “పట్టణంలో చిన్న వ్యాపారి అరగంట ఆలస్యంగా దుకాణం తెరిచి ఉంచితే వెంటనే చర్యలు తీసుకుంటారు… మరి హైవే పక్కన ఉన్న ధాబాలపై ఎందుకు చూపు పడడం లేదు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాణ్యతలేని ఆహారం, పరిశుభ్రత లేమి, మౌలిక వసతుల కొరత తీవ్ర సమస్యగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించడం, కలుషిత వాతావరణంలో వంటలు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
గ్రామాల వారీగా బెల్ట్ షాపులు పెరిగిపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. అధిక ధరలకు మద్యం విక్రయం, నకిలీ మరియు కల్తీ మద్యం సరఫరా జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల గ్రామస్థాయి వేలంపాటల ద్వారా కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కొన్ని ధాబాలకు సంబంధిత అధికారుల అండదండలు ఉన్నాయంటూ, కొందరు మీడియా వ్యక్తులకు ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారన్న ప్రచారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగానే తనిఖీలు జరగడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాక, ఈ అక్రమాలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిని అధికారుల పేర్లు చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నారనీ, తప్పులు చేయకుండా వారిపైనే నిందలు మోపుతున్నారనీ బాధితులు ఆరోపిస్తున్నారు. ధాబా యజమానుల ఈ ధోరణిపై ప్రజలు మండిపడుతున్నారు.
ప్రజల ప్రాణ భద్రత, ఆరోగ్యం, శాంతిభద్రతలతో ముడిపడిన ఈ అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే ప్రత్యేక దాడులు నిర్వహించి అక్రమ ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. “ఒకరికి ఒక చట్టం… మరొకరికి మరో చట్టమా?” అన్న ప్రశ్నకు అధికారులు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని స్థానికులు అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









