బోధన్, తేదీ:మార్చ్ 26 : నాలుగేళ్లుగా పిలర్ల దశలోనే ప్రాజెక్ట్… ప్రజల్లో ఆగ్రహం
బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సమీకృత మరియు నాన్వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సమీప ప్రాంతాలకు మార్కెట్ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురైన ఉదాహరణగా మారింది.
ఈ నిర్మాణాన్ని 2022 డిసెంబర్ 8న మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ రూ.7.20 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. సుమారు 120 దుకాణాలతో నిర్మించాల్సిన ఈ మార్కెట్ ద్వారా చిన్న వ్యాపారులకు ఉపాధి కల్పించడంతో పాటు శక్కర్ నగర్ ప్రజలకు సమీపంలోనే మార్కెట్ సౌకర్యం అందించాలనే ఉద్దేశం ఉంది.
అయితే పనులు ప్రారంభమైన కొద్ది కాలానికే నిలిచిపోయి, ప్రస్తుతం కేవలం కాంక్రీట్ పిలర్ల స్థాయిలోనే నిర్మాణం ఆగిపోయింది. నిర్మాణ స్థలం చుట్టూ గడ్డి, చెట్లు పెరిగిపోవడం, ఎక్కడికక్కడ మురికి పేరుకుపోవడం వంటి పరిస్థితులు అక్కడి నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.
పాత బస్టాండ్కు దూరంగా ఉన్న ప్రాంతాలకు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ను శక్కర్ నగర్లో ఏర్పాటు చేసినప్పటికీ, పనులు నిలిచిపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. ఇప్పటికే కేటాయించిన నిధులు ఏమయ్యాయి? నిర్మాణం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
నాలుగేళ్లుగా పనులు పూర్తికాకపోవడం వల్ల ప్రాజెక్ట్ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణమే స్పందించి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని శక్కర్ నగర్ ప్రజలు కోరుతున్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist







