నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఎల్లంపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు ను పరిశీలించిన కలెక్టర్
ప్రస్తుత నీటి నిల్వ, ఇన్ ఫ్లో
, ఔట్ ఫ్లో తదితర అంశాల పై ఆరా
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం అంతర్గాం, ఆగస్టు -19:
ఎల్లంపల్లి రిజర్వాయర్ లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* తెలిపారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అంతర్గాం లోని ఎల్లంపల్లి రిజర్వాయర్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి రిజర్వాయర్ లో ఉన్న నీటి నిల్వ ఎంత ఉంది? ఇన్ ఫ్లో ఎంత ఉంది? ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత? వంటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు.ప్రస్తుతం 35 గేట్ల ద్వారా ఎల్లంపల్లి నుంచి దిగువకు వరద విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు.ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున వరద వస్తున్నందున ఎల్లంపల్లి దిగువకు నీరు విడుదల చేస్తున్నామని, ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు, చేపలు పట్టేవారు రైతులు సామాన్య ప్రజలు నది దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఆధారంగా ఎప్పటికప్పుడు దిగువకు నీరు విడుదల చేయాలని కలెక్టర్ సూచించారు. డ్యాం గేట్లను పరిశీలించి వాటి నిర్వహణను పర్యవేక్షించారు. నీటి విడుదల అంశాలు రెగ్యులర్ గా ప్రెస్ కు విడుదల చేయాలని కలెక్టర్ ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు, రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు నీటిమట్టం అంచనా వేస్తూ జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి రామగుండం మండలం లోని ముంపు ప్రాంతం మల్కాపూర్ గ్రామంలో పర్యటించి లోతట్టు ప్రాంతాలలో నీరు ఒకే చోట నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సీఈ సుధాకర్ రెడ్డి, ఎస్.ఈ. సత్యనారాయణ, డీఈ బుచ్చి బాబు, శరత్ బాబు,తహసిల్దార్ ఈశ్వర్, ఈ ఈ రామన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Author: NAMANI RAKESH
STAFF REPORTER RAMAGUNDAM








