– అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం
– అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
– తమ ఆరాధ్య గురువును హేళన చేసిన వారికి హెచ్చరికలు
– అమిత్ షా ను మంత్రి పదవి నుండి బర్త రఫ్ చేయాలి
– లేనియెడల దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం
– అంబేద్కర్ సంఘం నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు ఉల్లెంగ బాల సాయి
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజు అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి కేంద్రమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఉల్లెంగ బాల సాయి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత మూడు రోజుల క్రితం లోక్ సభ లో కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవహేళన చేస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఒకపక్క ప్రధానమంత్రి మోడీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వల్లనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశ వైపు మొగ్గు చూపుతున్నాయని కీర్తిస్తుంటే .. ఆయన క్యాబినెట్లో కేంద్ర మంత్రి పదవి హోదాలో ఉండి కూడా విజ్ఞత మరిచిపోయి భారతదేశానికి దిక్సూచి అయిన మహనీయుడి గురించి కించపరిచినట్లు మాట్లాడడం సిగ్గుచేటు అని అన్నారు. దేవుడికి ,అంబేద్కర్ కు పొంతనలు చూపుతూ మాట్లాడడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కుల, మతాలకు అతీతంగా ఉద్యోగాలు, ఉన్నత పదవులు అనుభవిస్తూ ఈరోజు ఆయనను అవహేళన చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.

తమ ఆరాధ్య గురువును ఉద్దేశించి ఎంతటి వారైనా నోటి దురుసు మాటలు మాట్లాడినట్లయితే సహించేది లేదని తెలిపారు. వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల తమ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి న్యాయం జరిగే వరకూ ప్రభుత్వంతో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నీరడి లక్ష్మణ్, సలహాదారులు నర్సింహులు, కొరి మొగులయ్య , ధ్యాగలి బాలయ్య, గైని సాయికుమార్, పోచయ్య, గంగారాం, రోహిత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








