– నాటారు నట్టేట ముంచేశారు
– ప్రభుత్వ ధనం వృధా పట్టించుకోని పాలకులు అధికారులు
– ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
V1 న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బొప్పాస్ పల్లి సీడ్ ఫామ్ లో గత ప్రభుత్వ హయాంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే సదుద్దేశంతో రెండు ఎకరాల 38 గుంటల విస్తీర్ణంలో ఎకరానికి 57 మొక్కల చొప్పున మొత్తం 136, టనేరా జాతికి చెందిన మొక్కలను నాటించారు. మొక్కలకు నీరు అందించడానికి డ్రిప్ సిస్టం ను కూడా ఏర్పాటు చేయించారు. అయితే మొక్కల యొక్క సంరక్షణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం వల్ల వారి నిర్లక్ష్యం కారణంగా మొక్కలకు సరైన సమయంలో నీరు, ఎరువులు అందించకపోవడం వలన కాల క్రమేణా మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. ఇలాగే పరిస్థితి కొనసాగితే మొక్కలు మొత్తం చనిపోవచ్చని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన ప్రయోగం వృధా అవుతుందని స్థానికులు అంటున్నారు. క్షేత్రంలో డ్రిప్ సిస్టంకు సంబంధించిన పైపులను అస్తవ్యస్తంగా పడేసిన దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు పామాయిల్ పంటపై అవగాహన కల్పించడానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నీరుగారి పోతుందని రైతులు వాపోతున్నారు. రైతులు అవగాహన లేకుండా పామాయిల్ పంటను నేరుగా సాగు చేసినట్లయితే నష్టపోతారని గమనించి ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రయోగాత్మకంగా పంటను పండించిన తర్వాత రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగిన తర్వాత.. పామ్ ఆయిల్ పంటను సాగు చేసుకుని లాభాలు గడించి ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినప్పటికీ.. రైతులు ఈ పామాయిల్ క్షేత్రాన్ని సందర్శించి మొక్కలను గమనించిన తర్వాత తమ దిగులను వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో పామాయిల్ పంటను మేము సాగు చేసినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అనే సంశయంలో రైతులు ఆలోచిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రవ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సంబంధిత శాఖ అధికారులకు మరియు ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసి మొక్కలను సంరక్షించి తమ సంకల్పం నెరవేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ సందర్భంగా హరి నాయక్ అనే స్థానిక రైతు V1 న్యూస్ ప్రతినిధి తో పామ్ ఆయిల్ మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యంపై తన ఆవేదన వ్యక్తం చేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..