-యువత అవగాహన లోపంతో వ్యాపారంలో నష్టాల పాలవుతున్నారు
-వ్యాపారం చేసే ఆసక్తి, సామర్థ్యం ఉన్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్న యువత
-ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్ర
V1 న్యూస్ నిజామాబాద్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా: వర్ని మండల కేంద్రంలో గల మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం రోజు గ్రామీణ ప్రాంతాలలో నివసించే యువతకు వ్యాపార రంగాలలో రాణించే విధంగా ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సాండ్ర మరియు అనిల్ గుండ ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి దాదాపు 75 మంది యువత పాల్గొన్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ సుధీర్ సాండ్ర మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసించే యువత నిరుద్యోగులుగా మరియు వ్యాపార రంగంలో రాణించే ఆసక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఎక్కువ సమయం సామాజిక మాధ్యమాలలో కేటాయించడం వల్ల సమయం వృధా చేస్తూ.. ఆచరణలో విఫలమవుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ యాజమాన్యం అనంత జనార్ధన్ సామాజిక బాధ్యతగా భావించి యువత వ్యాపార రంగాలలో రాణించే విధంగా ఈరోజు తమ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. పట్టణాలలో సైతం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయలేని తరుణంలో మారుమూల వర్ని ప్రాంతం నుండి ప్రపంచ స్థాయిలో వ్యాపార మెళకువలు తెలుసుకునే విధంగా కృషి చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అనంత జనార్దన్ మాట్లాడుతూ పాఠశాల సమాజంలో ఒక భాగమని అదేవిధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా.. చదువుకున్న చదువులతో అందరికీ ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోవడం వల్ల నిరాశగా జీవితాలు గడుపుతున్నారన్నారు. అందువల్ల యువత వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ఈ శిక్షణ కార్యక్రమం తోడ్పడుతుందని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 75 మంది యువతీ ,యువకులు హాజరయ్యారని తెలిపారు. శిక్షణ కార్యక్రమం ద్వారా యువత జీవితాలలో మార్పులు కలిగి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్, వివిధ గ్రామాలకు చెందిన యువతీ ,యువకులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..