V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించుకొని అందంగా ముస్తాబై.. భక్తిశ్రద్ధలతో రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అలంకరించారు. పాఠశాల ఆవరణలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆటపాటలతో, కోలాటం నృత్యాలతో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలలో పాల్గొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు పండరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు పాఠశాలలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ సంబరాలను నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పిస్తూ భావితరాలకు పండగల యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఉత్తమ పౌరులుగా జీవించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ప్రపంచ దేశాలు మన భారతీయ సంస్కృతిని అనుసరిస్తుంటే మన దేశ ప్రజలు, ముఖ్యంగా యువత మాత్రం పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన భారతదేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ సంబంధాలు దెబ్బతిని.. పండగలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది. అందుచేత ప్రభుత్వాలు ముందు చూపుతో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో పాఠశాలలో ఒకరోజు కేటాయించి పండగల యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గునిగెరి హన్మండ్లు, ఉపాధ్యాయులు రుక్మిణి, అనూష, పుష్పలత, రూప, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..