V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వద్ద శుక్రవారం రోజు” పీఎం విశ్వకర్మ యోజన పథకం”లో భాగంగా వృత్తి శిక్షణ పొందిన 11 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయల రుణం మంజూరు చేయబడిన బ్యాంకు చెక్కులను బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు బ్యాంకు మేనేజర్ రాహుల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు పీఎం విశ్వకర్మ యోజన పథకం ద్వారా గ్రామాలలో మరియు పట్టణాలలో వృత్తి నైపుణ్య శిక్షణ లో నూతన మెలకువలు అవగాహన కల్పించి.. రుణ సదుపాయం ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడానికి సహకరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బిజెపి పార్టీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. అమలు పరుస్తూ మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినందుకుగాను వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల మరియు కులవృత్తులను నమ్ముకొని జీవించే వారికి ఆర్థికంగా ప్రోత్సహకాలు అందిస్తూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలను కల్పిస్తుందని తెలిపారు. ఈ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీ తో పొందిన రుణాలను 18 నెలల కాల పరిమితిలో తిరిగి బ్యాంకులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చెల్లించినట్లయితే భవిష్యత్తులో రుణ పరిమితి పెంచి తీసుకునే వెసులుబాటు ఉంటుందని అన్నారు. ఈ పథకం ద్వారా లభిస్తున్న రుణాలకు లబ్ధిదారులు ఎటువంటి రుసుములను బ్యాంకులకు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు. రుణ సదుపాయం పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కొరకు మరియు రైతుల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలుపరుస్తుందని అన్నారు. అందులో భాగంగా “పీఎం విశ్వకర్మ యోజన” పథకాన్ని కులవృత్తులు మరియు వృత్తి శిక్షణ పొందిన వారికి మొదటి విడతలో లక్ష రూపాయల రుణ సదుపాయం, రెండవ విడతలో రెండు లక్షల రుణ సదుపాయం మరియు మూడవ విడతలో మూడు లక్షల రుణ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు, జిల్లా ఓ బి సి కార్యవర్గ సభ్యుడు వడ్ల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి మేకల రాములు, మండల ఉపాధ్యక్షుడు అనుసూరి శ్రీనివాస్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు యాదగిరి గౌడ్, బూత్ అధ్యక్షులు కంది పెద్ద మల్లేష్, ఉల్లెంగ గోపి, పెర్క రాములు, ర్యాపని మహేష్, సాయిలు, పర్వయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








