-రాష్ట్ర ముఖ్యమంత్రి మతిభ్రమించి, భాషా పరిజ్ఞానం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు
-సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేవరకు పోరాటం ఆగదు
-బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ జుబేర్
V1 న్యూస్ బాన్సువాడ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం మరియు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.. బాన్సువాడ పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ మరియు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్సువాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తా లో తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ నిజాం రాజుల నిరంకుశ పరిపాలన అప్పటి తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అమాయకపు ప్రజలపై దాడులు నిర్వహించి కంటి పై కునుకు లేకుండా చేశారని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మతిభ్రమించి.. భాషా పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయం దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని మరియు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయించారని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా.. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని మాట్లాడడం సరైనది కాదని అన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల రెండు లక్షల రుణమాఫీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో చేయకపోవడం బాధాకరమన్నారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేంతవరకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అహర్నిశలు పోరాటం చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించే వరకు ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, అఫ్రోజ్, రమేష్ యాదవ్, శివ సూరి, గౌస్, మహేష్, గొడిసెల నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, గంగారం, అంజయ్య, కరీం, సాయి, సంజయ్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








