– రైతులు పంట పొలాల వద్ద వర్షం వల్ల తడిసిన విద్యుత్ స్తంబాలు ఎక్కడంగాని , విద్యుత్ తీగలను తాకడం గాని చేయకూడదు
– ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకూడదు
– చిన్నపిల్లలు వయోవృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలి
– శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
– మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని మాజీ ఏఎంసీ చైర్మన్ పెరిక శ్రీనివాస్ ఆదివారం రోజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత రెండు మూడు రోజులుగా అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వారు తెలియజేశారని అన్నారు. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం గా ఉండాలని ఆదేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వర్షం వల్ల తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలను తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇనుప రేకుల ఇళ్లల్లో నివసించే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్యుత్ అంతరాయం వల్ల సమస్యలు తలెత్తకుండా విద్యుత్ శాఖ వారు తగుజాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జనావాసాలలో అధికంగా వర్షపు నీరు నిలవడం వలన నీరు కుళ్ళిపోయి వాటిలో అధికంగా దోమలు వ్యాప్తి చెంది వాటి కారణంగా సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన జ్వరాలు వ్యాపిస్తాయని.. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. చిన్నపిల్లలు, వయోవృద్ధులు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలకు, తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరి ఇల్లు అయిన పూర్తిస్థాయిలో శిథిలావస్థలో ఉన్నట్లయితే స్థానికంగా ఉండే తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారని అన్నారు. ఒకవేళ అధికారులు స్పందించినట్లయితే సమాచారం మా దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. డ్రైనేజీ కాలువలు, వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రభుత్వం ముందస్తుగానే పాఠశాలలకు సెలవులను కూడా ప్రకటించిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండి అప్రమత్తంగా ఉండాలని కోరారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..