– వర్షం వల్ల తడిసిన విద్యుత్ స్తంబాలు, విద్యుత్ తీగలను ప్రజలు తాకకూడదు
– ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు చెరువుల వద్దకు ప్రజలు వెళ్లకూడదు
– శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
– జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్
V1 న్యూస్ జుక్కల్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావ్ ఆదివారం రోజు ప్రజలకు సూచించారు. గత రెండు మూడు రోజులుగా అన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వారు తెలియజేశారని అన్నారు. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం గా ఉండాలని ఆదేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. వర్షం వల్ల తడిసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ఇనుప స్తంభాలను తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇంట్లో ఉండే విద్యుత్ పరికరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వయోవృద్ధులు బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలకు, తీగలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, చెరువుల వద్దకు వెళ్లవద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరారు. గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఒకవేళ ఎవరి ఇల్లు అయిన పూర్తిస్థాయిలో శిథిలావస్థలో ఉన్నట్లయితే స్థానికంగా ఉండే తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తారని అన్నారు. ఒకవేళ అధికారులు స్పందించినట్లయితే సమాచారం ఎమ్మెల్యే కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. డ్రైనేజీ కాలువలు, వాగులు వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..