V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు “భారతరత్న” అవార్డు గ్రహీత భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ అటల్ బిహారి వాజ్ పాయ్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో వాజ్ పాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నసురుల్లాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గొడిసెల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ శ్రీ అటల్ బిహారీ వాజ్ పాయ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించారని తెలిపారు. ఆయన భారతదేశానికి మూడు పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారని తెలిపారు. మొదటిసారి ప్రధానమంత్రిగా 13 రోజుల పాటు పనిచేశారని.. రెండవసారి ప్రధానిగా 13 నెలల పాటు పనిచేశారని.. మూడవసారి ప్రధానమంత్రిగా పూర్తి కాలం ఐదు సంవత్సరాల కాలం పాటు పనిచేశారని అన్నారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారని అన్నారు. ” జన సంఘ్ పార్టీ”కి అధ్యక్షుడిగా పని చేశారని అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేశారని తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో “ఆర్థిక సంస్కరణలను” ప్రవేశపెట్టారని కొనియాడారు. అణుబాంబుల తయారీలో కూడా ఆయన అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారని జీవితకాలం పాటు అపర బ్రహ్మచారిగా ఆయన జీవితాన్ని గడిపాడని అన్నారు. ఆర్ఎస్ఎస్ లో సభ్యుడిగా పనిచేసి “హిందూ భావజాలాన్ని” భారతదేశ సంస్కృతి ,సంప్రదాయాలను ప్రపంచం నలుమూలల చాటే విధంగా కృషి చేశారని కొనియాడారు.భారతదేశానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం “భారతరత్న” తో సత్కరించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోశక్తి కేంద్రం ఇన్చార్జి గంగాధర్ గుప్తా, నసురుల్లాబాద్ గ్రామ అధ్యక్షుడు కంది పెద్ద మల్లేష్, భూత్ అధ్యక్షుడు ఉల్లెంగ గోపి, బిజెపి పార్టీ దళిత ఉపాధ్యక్షుడు ఉల్లెంగ పర్వయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








