-పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూ మూగజీవాలు మృత్యువాత చెందుతున్నా కూడా సంబంధిత శాఖ అధికారుల్లో చలనం లేకుండా పోయింది ఈ మధ్యకాలంలోనే నెమ్లి సాయిబాబా గుడి సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మూడు ఆవులు మృత్యువాత చెందిన ఘటన చోటుచేసుకుంది. అదేవిధంగా గత ఏడాది మైలారం గ్రామ శివారులో ఓ ఆవు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. ఇంత జరుగుతున్నప్పటికీ మండల వ్యాప్తంగా ఉన్న విద్యుత్ నియంత్రికలకు కంచె ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. సంబంధిత అధికారులు కేవలం ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా అంటూ ప్రజలు బాహాటంగానే చర్చిస్తున్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ చిన్నారులకు సైతం చేతికి అందే ఎత్తులోనే ఏర్పాటు చేసి ఉంది. దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాల్సి ఉన్నా కూడా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు అక్కడ పశువులకు గాని ప్రజలకు గాని ప్రమాదం జరుగుతుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నియంత్రికకు కంచె ఏర్పాటు చేసి భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..