-పట్టింపు లేనితనంగా వ్యవహరిస్తున్న టీటీడీ నిర్వాహకులు
V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బీర్కూర్ మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో కొండపై వెలసి తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని కారణంగా ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో వస్తున్న భక్తులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. శ్రావణమాసం ప్రారంభమై మొదటి శనివారం మరియు ఆలయంలో సుదర్శన యాగం నిర్వహించడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రాకను అంచనా వేయలేదని సమర్ధించుకోవడం బాధాకరం. ఆలయ కమిటీ సభ్యులు భక్తులను పస్తులు ఉంచాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి భక్తులు అన్న ప్రసాదం కొరకు ఖాళీ ప్లేట్ లతో ఎదురు చూస్తూ పడి కాపులు కాశారు. కొంతమంది భక్తులు వేచి చూడడం కుదరక భోజనం చేయకుండానే వెనుతిరిగి పోయారు. త్రాగునీటి సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అపరి శుభ్రంగా ఉన్న నీటిని త్రాగాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నదాన సత్రం భవనం లోపల నీరు క్రింద పారబోయడంతో భక్తులు కూర్చోవడానికి అసౌకర్యంగా ఉంది.. కొందరు భక్తులు జారిపడ్డ ఘటనలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పలుమార్లు ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులను కేటాయించారు. అన్నదానం కార్యక్రమానికి భక్తుల నుండి పెద్ద మొత్తంలో విరాళాలు సేకరిస్తునప్పటికి భక్తులకు మాత్రం నామమాత్రంగా నీళ్ల చారుతో మాత్రమే భోజనం వడ్డిస్తున్నారంటూ భక్తులు పెదవిరుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచి తెలంగాణ తిరుమల తిరుపతి క్షేత్రంగా మరియు పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు తగిన విధంగా వసతులను కల్పించాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








