V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: రైతులకు పంట రుణాలు అందించడంలో ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం రోజు కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎంజివై, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణాల లక్ష్యం వాటి పురోగతిపై బ్యాంకర్లతో జిల్లా సమన్వయ కమిటీ, జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్, సూక్ష్మ, చిన్న, మధ్యతరః పరిశ్రమలు, తదితర రంగాలకు రూ.6,412.60 కోట్లు లక్ష్యం నిర్దేశించుకుని రుణాలు అందించనున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో రూ.5610.28 కోట్లు దాదాపు 87.48 శాతం ప్రాధాన్యతా రంగాలకు కేటాయించగా, రూ 802.28 కోట్లు అనగా 12.51 శాతం రుణాలు ఇతర రంగాలకు కేటాయించామన్నారు. ఇందులో ప్రధానంగా రూ 3425.85 కోట్లు పంట రుణాలు, రూ 732.38 కోట్లు రుణాలు కాగా రూ. 537.73 కోట్లు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వంటి వ్యవసాయ అనుబంధ సాంకేతిక పరికరాల కొనుగోలుకు ఖర్చు చేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహాయంగా రుణాలు రూ. 700.94 కోట్లు, విద్య గృహ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తికి రూ. 213.38 కోట్లు కేటాయించామని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, వివిధ బ్యాంకుల ప్రత్యేక అధికారులు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..