బిచ్కుందా :అక్రమార్కుల కన్ను ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూములపై పడింది. యథేచ్ఛగా కబ్జా చేస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. అయినా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శాంతాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ప్రైవేటు భూమితో పాటు ప్రభుత్వ వక్ఫ్ బోర్డు భూమిని కూడా కబ్జా చేసి ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు ఆ గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగుతు, పదవి విరమణ కాగానే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ గత ఎమ్మెల్యే కనీసం జెండా పట్టని ఆ వ్యక్తికి కీలక నామినేటెడ్ పదవి ఇవ్వడం గమనార్హం. పదవిని అడ్డుపెట్టుకుని ధనార్జనే ధ్యేయంగా అడ్డగోలుగా దర్జాగా కబ్జా చేస్తున్నాడు. గతంలో తప్పుడు దృవపత్రాలు సృష్టించి ఫోర్జరీ చేసాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కబ్జా చేసిన భూములపై యధేచ్ఛగా కోళ్ళ ఫారం కొనసాగించడం కొసమెరుపు. ప్రశ్నించే వారికి ముడుపులు వినకపోతే బెదిరింపులకు పాల్పడి, లేదంటే ఏదైనా కేసుల్లో ఇరికించి సదరు ఆ వ్యక్తి లబ్ధి పొందేందుకు సిద్ధపడ్డాడని మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రియల్టర్లు, బడా నాయకులు ఇచ్చే మామూళ్లకు కిందిస్థాయి రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలుస్తోంది. ఏండ్ల తరబడి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఒక్కసారిగా రియల్టర్ల చేతుల్లోకి వెళ్లడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నాయకుల ఒత్తిళ్లకు తూతూ మంత్రంగా సర్వేలు నిర్వహిస్తూ ఎక్కడో ఒకచోట ప్రభుత్వ స్థలమని బోర్డు పాతి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించుకొని రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నా, రెవెన్యూ అధికారులు నిద్రమత్తు వీడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చి సహకరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
మండల తహశీల్దార్ సురేష్ ను విలేకరి సంప్రదించగా
ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే తమ దృష్టికి తీసుకురావాలి. గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు ఉంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని, శాంతాపూర్ గ్రామంలో వక్ఫ్ బోర్డు భూములు కబ్జా అయినట్లు తమ దృష్టికి వచ్చిందని త్వరలో సర్వే చేస్తామని పేర్కొన్నారు.

Author: IRFAN Reporter
Work from as a journalist