V1News Telangana

best news portal development company in india

సాలూర–హున్సా బైపాస్ వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజ్ – నదిలా వృథాగా పారుతున్న తాగునీరు, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్

SHARE:

సాలూర మండలంలోని సాలూర–హున్సా బైపాస్ రహదారి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్‌లో లీకేజ్ ఏర్పడి విలువైన తాగునీరు నదిలా వృథాగా పారిపోతుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ పథకం అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల ముందే అపహాస్యంగా మారుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రోజుల తరబడి లీకేజ్ కొనసాగుతున్నా సంబంధిత అధికారులు, ఇంజినీరింగ్ శాఖలు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఎదురవుతుంటే, మరోవైపు అదే తాగునీరు రహదారులపై వృథాగా పారిపోవడం అత్యంత దురదృష్టకరమని వారు అంటున్నారు. ఇది కేవలం నీటి వృథా మాత్రమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు జరుగుతున్న భారీ నష్టమని పేర్కొంటున్నారు.
లీకేజ్ కారణంగా రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జారిపడే అవకాశాలు ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉందని, దీనికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ హైవేకు సమీపంలో ఈ పరిస్థితి ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి హెచ్చరిక బోర్డులు, భద్రతా చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
“మిషన్ భగీరథ ప్రజల కోసం కాదా..? లేక నీటిని వృథా చేయడానికేనా..?” అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించి పైప్‌లైన్ లీకేజ్‌ను నిలిపివేసి మరమ్మత్తులు చేపట్టాలని, రహదారిపై పేరుకుపోయిన నీటిని తొలగించి వాహనదారుల భద్రతను నిర్ధారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు, సంబంధిత ఇంజినీరింగ్ శాఖలు మరియు మండల అధికారులు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే ఇది అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india