రుద్రూర్ మండల కేంద్రంలోని చిక్కడపల్లి గ్రామంలో మానవత్వానికి నిదర్శనంగా పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. వివిధ కారణాలతో మృతి చెందిన తమ స్నేహితుల కుటుంబానికి అండగా నిలుస్తూ, ఆదివారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
రుద్రూర్ మండలం చిక్కడపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు రుద్రూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–2003 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్నారు. విద్యార్థి దశలో ఏర్పడిన స్నేహబంధాన్ని మరచిపోకుండా, తమతో కలిసి చదువుకున్న స్నేహితుడు మృతి చెందడంతో అతని కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో మృతి చెందిన స్నేహితుడి కుటుంబాన్ని కలిసి పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి రూ.15,000 నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, స్నేహం అనేది చదువుతో ముగిసిపోదని, కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉండడమే నిజమైన స్నేహమని పేర్కొన్నారు. తమ చిన్న సహాయం అయినప్పటికీ బాధిత కుటుంబానికి కొంత ఊరటనిచ్చిందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సేవా కార్యక్రమంలో జాఫర్,నయీమ్, రాము, కాంతారావు, పవన్, గణేష్, అశోక్, రమేష్, గోరే బాబు, సంతోష్, విజయ్, నగేష్, గణేష్, పోశెట్టి, రవి, శ్రీనివాస్, పురుషోత్తం తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
స్నేహితుల కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థుల సేవా భావాన్ని గ్రామస్తులు అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
Author: IRFAN Reporter
Work from as a journalist








