హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; పేదల సొంతింటి కలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడతలో 4,16,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సమీక్షిస్తూ జూన్లో వీలు అయినన్ని ఎక్కువ ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం దిశగా ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల కమిటీలతో పాటు అధికారులు పక్కాగా అర్హులను గుర్తిస్తున్నారు. ఎక్కడైనా అనర్హులకు ఇల్లు ఇస్తే అధికారులపై కఠిన చర్యలుంటాయని రాష్ట్ర మంత్రులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో లోపాలు లేకుండా జిల్లా కలెక్టర్లు పక్కాగా బాధ్యతను తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. గ్రామాలవారీగా వచ్చిన దరఖాస్తుల్లో ప్రాధాన్య క్రమంలో నిరుపేదలను గుర్తిస్తున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో లబ్ధిదారుల తీరుని పరిశీలించి ఆమోద ముద్ర వేస్తున్నారు. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎంపీడీవోల స్థాయిలో 2,86,016 మంది లబ్ధిదారులవి ఆమోదం పొందారు. జిల్లా కలెక్టర్ల స్థాయిలో 2,03,744 మందికి ఆమోదం లభించింది. ఇందులో గత నెల 28 నాటికి 1,89,997 మందికి మాత్రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలను ఇచ్చారు. మొత్తంగా మంజూరు అయిన 4,16,500 ఇళ్లతో పోలిస్తే 45 % పురోగతి కనిపిస్తోంది. గృహనిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారులకు దిశానిర్దేశం చేస్తూ వీలు అయినంత తొందరగా వీటి ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేందుకు సహకరిస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రస్థాయిలో ఇప్పటికి ముందు వరుసలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 7,862 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఏకంగా 7,808 (99.31 %) మంది అర్హులను గుర్తించిన అధికారులు వారికి ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. ఉత్తర్వులు అందుకున్న వాటిలో కామారెడ్డి జిల్లా 92 % (11,151 మంది)తో రెండో స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లా 90 % (15,780 మంది)తో మూడో స్థానంలో ఉంది.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533