– నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారులు
– చందూరి హన్మాండ్లు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి
కామారెడ్డి జిల్లా:కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తాము అని వాగ్దానం చేసి.. ఇప్పుడు సన్న రకం ధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను నయవంచన చేయడమే అవుతుందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చందూరి హన్మండ్లు తెలిపారు. అదేవిధంగా మైక్రో మీటర్లతో వరి గింజలను 6mm పొడవు కంటే తక్కువ ఉండకూడదు మరియు వెడల్పు 2mm ఎక్కువ కాకుండా ఉండాలి.. తేమ17 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు అని రకరకాల నిబంధనలు పెట్టి రైతన్నలను మానసికంగా హింసించడం చాలా బాధాకరం అన్నారు. అదేవిధంగా సన్న రకం ధాన్యంలో కూడా కేవలం 33 రకాల వడ్లు మాత్రమే కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలతో రైతాంగం అతలాకుతలమవుతుంటే మరోపక్క ప్రభుత్వం మరియు సంబంధిత శాఖ అధికారుల నిర్లక్ష్యం వలన రైతులు ధాన్యం కుప్పల వద్ద పడి కాపులు కాస్తూ కంటిమీద కునుకు లేకుండా బోరున విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను పరిశీలించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు సన్నం మరియు దొడ్డు రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలి.. ఇప్పటికే చాలామంది రైతులు వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో జాప్యం జరగడం వలన రైతులు దళారులను ఆశ్రయించి రకరకాలుగా నష్టపోవడం జరిగింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..