V1 న్యూస్ కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో బుధవారం రోజు మాజీ శాసనసభాపతి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం మరియు పాత్రికేయులు, మీడియా అందరి సమక్షంలో నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. అనంతరం వరద గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల్లోకి ఎగువ ప్రాంతం నుండి వచ్చి చేరుతున్న వరద నీటి వివరాలు మరియు ప్రాజెక్టు నుండి దిగువకు విడుదల చేస్తున్న నీటి వివరాలను నీటి పడదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు జలకల సంతరించుకుందని అన్నారు. వర్షాకాలం ప్రారంభం నాటి నుండి వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం వలన రైతులు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండాలని దేవుళ్లను వేడుకున్నారని గుర్తు చేశారు. ప్రాజెక్టు నీటితో పూర్తిస్థాయిలో నిండడం వలన రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు ఢోకా లేనట్లేనని తెలిపారు. రైతులు నీటిని జాగ్రత్తగా వినియోగించుకొని పంటలు పండించుకోవాలని సూచించారు. ప్రాజెక్టులోకి ఎగువ నుండి 18,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405.00 అడుగులు17.802 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 1403.45 అడుగులు15.9 టీఎంసీలు నీరు నిల్వ ఉందని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా మంజీరా నదిలోకి నీటిని వదులుతున్నందున మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








