ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ కు అధిక ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రోగులకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంపొందించాలి
వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరగకుండా పకడ్బందీ చర్యలు
355 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం వచ్చే జూలై నాటికి పూర్తి చేయాలి
రామగుండం జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్న జిల్లా కలెక్టర్
V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం, ఆగస్టు-24:
రామగుండం జనరల్ ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం జనరల్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ లతో కలిసి పాల్గొన్నారు రామగుండం వైద్య కళాశాల ఏర్పాటు, జనరల్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రస్తుత ఆసుపత్రికి ఉన్న అవసరాలు మొదలగు అంశాలను జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హిమ బిందూ సింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జనరల్ ఆసుపత్రిలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, లాజిస్టిక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత మెరుగ్గా అందే దిశగా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పని చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ చాలా వరకు మెరుగు కావాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్య కాంట్రాక్టర్ ను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మేర పారిశుధ్య కార్మికులతో ఆసుపత్రి పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ధ్యంలో గణనీయమైన మార్పు రాని పక్షంలో అవసరమైతే కాంట్రాక్టర్ ను కూడా రద్దు చేయాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తించే తీరును నిరంతరం పర్యవేక్షించాలని, రోగులతో, వారి సహాయకులతో సిబ్బంది ఓపికతో ఉండే విధంగా చూడాలని అన్నారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాల పనితీరును ప్రతి వారం రివ్యూ చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ లకు ప్రత్యేక విధులను కేటాయించాలని కలెక్టర్ తెలిపారు. రామగుండం వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం మెడికల్ కళాశాలకు అనుసంధానంగా నిర్మిస్తున్న 355 పడకల ఆసుపత్రి నిర్మాణ భవనం సకాలంలో పూర్తి చేయాలని, వచ్చే జులై నాటికి ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పూర్తయ్యే విధంగా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఆసుపత్రుల్లో రోగులకు అందించే నాణ్యమైన వైద్యంతో పాటు వారితో సిబ్బంది ప్రవర్తన తీరు కూడా ముఖ్యమని అన్నారు. పారిశుధ్య అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, దానికి అనుగుణంగా ఆసుపత్రికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామగుండం జనరల్ ఆసుపత్రి సందర్శించారు. ఆపరేషన్ థియేటర్ రీన్నోవేషన్ , లేబర్ రూమ్ విస్తరణ, పేమెంట్ రూం ల విస్తరణ పనులను పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ప్రజాప్రతినిధులు సంబంధిత వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM