V1 న్యూస్ నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారు ప్రాంతంలో ప్రకృతి ఒడిలో చెట్టు కింద వెలసిన అమ్మవారు “కొచ్చేరు మైసమ్మ తల్లి”ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం రోజు గ్రామ ప్రజలు మరియు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు బంధుమిత్రులతో కలిసి అమ్మవారికి నైవేద్యాలు, ఓడి బియ్యం, కానుకలతో మొక్కులు చెల్లించుకుని అంగరంగ వైభవంగా పండుగను జరుపుకున్నారు…
దేవాలయ ప్రాంగణాన్ని రకరకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న తమ బంధువులను, మిత్రులను ఆహ్వానించి వనభోజనాలు నిర్వహించుకున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ అనాదిగా వస్తున్న అమ్మవారి ఉత్సవాలను గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో కిక్కిరిసిపోయి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ పెరిక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సాయిరాం యాదవ్, మాజీ ఎంపిటిసి మహేందర్, బాల హరిశ్చంద్ర రెడ్డి , రాఘవ, రణధీర్ రెడ్డి, భాస్కర్, జగన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..