-గ్రామాలలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల పట్ల అసంతృప్తి
-శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి పూర్తిస్థాయిలో నివేదిక అందించాలి
-ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
-ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ హెచ్చరిక
V1 న్యూస్ ఎల్లారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో భారీ వర్షాలు కురవకముందే శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని శుక్రవారం రోజు సంబంధిత శాఖ అధికారులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో ప్రస్తుతం నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనుల పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారులు సమయానికి విధులకు హాజరై ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేసి సమర్పించాలని అధికారులకు సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను నిర్వీర్యం చేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గృహ నిర్మాణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..