V1News Telangana

best news portal development company in india

మంత్రి పొంగులేటిని కలిసిన జర్నలిస్టు నేతలు

SHARE:

మంత్రి పొంగులేటిని కలిసిన జర్నలిస్టు నేతలు

మంత్రి దృష్టికి జర్నలిస్టుల సమస్యలు

త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం జనవరి 06:-

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర నాయకులు కోరారు. ప్రధానంగా జర్నలిస్టుల ఇళ్ళ స్థలాల సమస్యను గత ప్రభుత్వం పరిష్కరించకుండా పదేళ్లుగా జాప్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యను పరిష్కరించి జర్నలిస్టులకు న్యాయం చేయాలని వారు రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కోరారు. శనివారం జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, తన్నీరు శ్రీనివాస్, కార్యదర్శి ఈ. చంద్రశేఖర్, నాయకులు కె. పాండురంగారావు, జే. ఉదయభాస్కర్ రెడ్డి, యర్రమిల్లి రామారావు తదితరులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రికి జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. జర్నలిస్టులకు గతంలో మూడు సార్లు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇస్తుందన్న నమ్మకం ఉందని ఫెడరేషన్ నేతలు మంత్రితో అన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ఒకేసారి రూ.100 కోట్లు విడుదల చేయాలని, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ఇచ్చే సహాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు. పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో హెల్త్ కార్డులు జారీ చేసి, అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు పని చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆర్ ఎన్ ఐ గుర్తింపు పొందిన అన్ని చిన్న, మధ్య తరహా పత్రికలను, కేబుల్ టీవీ న్యూస్ చానల్స్, డిజిటల్ మీడియాలను ప్రభుత్వం గుర్తించి, ప్రకటనలు, రాయితీల ద్వారా ఆదుకోవాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, సరైన వేతనాల చెల్లింపులకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో అనేక మంది జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల బనాయింపులు జరిగాయని, అలాంటివి జరుగకుండా నిరోధించాలని, రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు వేయాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టులకు, కుటుంబ సభ్యులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, రైల్వే రాయితీ పాస్ ల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని, మహిళా జర్నలిస్టుల రక్షణకు చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్య వసతి కల్పించాలని జర్నలిస్టు ఫెడరేషన్ నాయకులు మంత్రిని కోరారు. ఈ సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ… జర్నలిస్టులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విషయం వాస్తవమేనని, జర్నలిస్టుల సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు అంతో ఇంతో మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే…అది కాంగ్రెస్ ప్రభుత్వమనే చెప్పక తప్పదని, అందుకే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల సంక్షేమం కార్యక్రమాలు మేనిఫెస్టోలో చేర్చి అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india