నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్
ప్రజల ప్రయోజనాల కోసం ప్రత్యేక న్యాయ పరిష్కార వేదిక : జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి.
నిజామాబాద్, నవంబర్ 1:
ప్రజల విసృత ప్రయోజనాల దృష్ట్యా నవంబర్ 15న జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్పర్సన్ శ్రీమతి జి.వి.ఎన్. భారత లక్ష్మి తెలిపారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలోని తన చాంబర్లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, IPS, న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఉదయ్ భాస్కర్ రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
ఆమె మాట్లాడుతూ, రాజీ పడదగిన 1328 క్రిమినల్ కేసులను గుర్తించి, వాటిని వివిధ లోక్ అదాలత్ బెంచ్ల ద్వారా పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని పేర్కొన్నారు.
ఆర్మూర్, బోధన్ కోర్టు ప్రాంగణాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఈ ప్రత్యేక లోక్ అదాలత్ జరుగుతుందని ఆమె వివరించారు. ప్రజలు రాజీ పరిష్కారం వైపు ముందుకు రావాలని పౌర సమాజాన్ని జిల్లా జడ్జి విజ్ఞప్తి చేశారు.
“మనిషి సంఘజీవి. సమాజంలో శాంతియుత సహజీవనమే మన జీవన విధానంగా మారాలి. వివాదాలు రాజీపద్దతిలో పరిష్కారమవడం ద్వారానే ప్రజా శాంతి, న్యాయం స్థిరపడుతుంది,” అని జిల్లా జడ్జి శ్రీమతి భారత లక్ష్మి పేర్కొన్నారు.
“లోక్ అదాలత్ విజయవంతానికి పోలీస్ శాఖ మద్దతు” — కమిషనర్ సాయి చైతన్య
పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య, IPS, మాట్లాడుతూ ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీస్ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. చిన్న చిన్న క్రిమినల్ కేసులు, క్షణిక ఆవేశంలో జరిగే రాజీ పడదగిన వివాదాలను ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
“తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ గారి మానసపుత్రిక ఈ ప్రత్యేక లోక్ అదాలత్,” అని ఆయన అభివర్ణించారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి భారత లక్ష్మి గారితో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు.
న్యాయసేవ కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు
న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీ ఉదయ్ భాస్కర్ రావు మాట్లాడుతూ — “న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, న్యాయార్థుల అభీష్టానికి అనుగుణంగా వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరిస్తున్నాం” అని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








