– గొప్ప సంకల్పంతో సేవా కార్యక్రమాలలో భాగస్వాములవుతున్న మనసున్న మహారాజులు
– మృతురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ, రూ.13,100 ఆర్థిక సహాయం అందజేత
– వినూత్న ప్రయత్నంతో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న నసురుల్లాబాద్ గ్రామ వాసులు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
V1 న్యూస్, అక్టోబర్ (05) కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన ప్రజలు మానవతా దృక్పథంతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహకారం అందజేస్తూ గొప్ప మనసును చాటుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసుకుని తద్వారా ఎవరికి తోచిన ఆర్థిక సహాయం వారు అందిస్తూ అందరూ కలిసి నగదును పోగుచేసి మృతి చెందిన కుటుంబ సభ్యులకు దశదినకర్మ రోజు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గత ఐదు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఉల్లెంగ సాయవ్వ అనే వ్యక్తి మృతి చెందారు.. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా నగదును రూ.13,100 పోగుచేసి వారి ఇంటి వద్దకు వెళ్లి మృతురాలి కుమారుడు ఉల్లెంగ కిరణ్ కు అందజేశారు. ఎదుటివారికి సహకారం అందించాలనే గొప్ప సంకల్పంతో గ్రామ ప్రజలందరూ గ్రూపును ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మృతురాలి కుమారుడు ఉల్లెంగ కిరణ్ గ్రామ పెద్దలకు మరియు గ్రూపు సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదేవిధంగా భవిష్యత్తులో ప్రతి ఒక్కరి కుటుంబానికి ఆర్థిక సహకారం అందజేసే విధంగా అందరూ తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. తాము కూడా ఇలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాముల మవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్ , చుంచు పెద్ద సాయిలు, యూసుఫ్, అల్లం గంగారం, టేకుర్ల సాయిలు, మామిడి భూమయ్య, ఉల్లెంగ గంగారాం, ఉల్లెంగ చిన్న సంగయ్య, గైని మొగులయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








