71 పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం31 జెడ్పీలు, 566 ఎంపీపీలు – పీఆర్ఎస్ శాఖ తాజా లెక్కలుతెలంగాణలో గ్రామ పంచాయతీల మున్సిపాలిటీల్లో విలీనంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్యలో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, తాజాగా ఈ సంఖ్య 5,773కి తగ్గింది. అంటే మొత్తం 44 ఎంపీటీసీ స్థానాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు.
ఈ మార్పులకు ప్రధాన కారణంగా 71 గ్రామ పంచాయతీలను జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనం చేయడం పేర్కొనవచ్చు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లో పలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వల్ల ఎంపీటీసీల లెక్క మారింది.
ఇక సంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాంతాల్లో కలిపి సుమారు 18 పంచాయతీలు ఉన్నాయని సమాచారం. వీటి డీనోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయితే, ఎంపీటీసీ సంఖ్య మరింత తగ్గే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అలాగే, గత ఎన్నికలతో పోల్చితే ఒక జెడ్పీ స్థానం కూడా తగ్గింది. 2019లో రాష్ట్రంలో 32 జెడ్పీలు ఉండగా, ఇప్పుడు అవి 31కి పరిమితమయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మున్సిపాలిటీలలో విలీనం కారణంగా ఈ జిల్లా స్థానిక ఎన్నికల పరిధి నుంచి తప్పిపోయింది.
ఇక ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల లెక్క ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 566 స్థానాలు ఉన్నాయి. ఇందులో నల్గొండ జిల్లాలో అత్యధికంగా 33, ములుగు జిల్లాలో అత్యల్పంగా 10 స్థానాలున్నాయి.
గ్రామ పంచాయతీలు కూడా తగ్గినాయి. 2019లో 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, ప్రస్తుతం అవి 12,759కు చేరాయి. తాజా సమాచారం ప్రకారం, హలియా మున్సిపాలిటీ పరిధిలోని ఒక గ్రామ పంచాయతీని డీనోటిఫై చేయడంతో పీఆర్ఎస్ శాఖ పరిధిలోకి మళ్లీ చేరనుంది. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 12,760గా నమోదయ్యే అవకాశముంది.
అలాగే, గ్రామ వార్డుల సంఖ్య కూడా 1,13,136 నుండి 1,12,500కి తగ్గింది. పీఆర్ఎస్ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. గెజిట్, షెడ్యూల్ ప్రకటనల కోసం సంబంధిత శాఖల సమన్వయంతో కసరత్తు కొనసాగుతున్నది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








