పుస్తకాలు, యూనిఫార్మ్స్, బూట్ల అమ్మకాలు ఆపకపోతే ఆందోళనలు తప్పవని PDSU, TSP, GVS హెచ్చరిక…
బాన్స్వాడ, జూన్ 5:
ప్రైవేట్ విద్యను లాభాల వ్యాపారంగా మార్చడాన్ని ఖండిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU-S), తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP), గిరిజన విద్యార్థి సంఘం (GVS) ఆధ్వర్యంలో బాన్స్వాడ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు ఎన్. బాల్ రాజ్ (PDSU), మావురం శ్రీకాంత్ (TSP), సభవత్ వినోద్ (GVS) గళం వినిపించారు.
“జూన్ నెల వస్తుందంటేనే పుస్తకాల దందా మొదలవుతోంది” అని వారు ఆరోపించారు.
ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను తమ స్కూల్ మేనేజ్మెంట్కి కట్టివేసేలా పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫార్మ్స్, బూట్లు, సాక్స్—all-in-one ప్యాకేజీ పేరుతో భారీ ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. ఇది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు అన్యాయం అని విద్యార్థి నాయకులు మండిపడ్డారు.
“ఫీజుల భారంతో అల్లాడుతున్న తల్లిదండ్రులపై మరో బాదుడు – ఇది దోపిడీ తప్ప మరొకటి కాదు!” అని వారు వ్యాఖ్యానించారు.
వారు విద్యాధికారులను కఠినంగా హెచ్చరిస్తూ, “ప్రతి ప్రైవేట్ విద్యాసంస్థను తనిఖీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో విద్యార్థి ఉద్యమాలతో తుఫాను తేలుస్తాం” అని స్పష్టం చేశారు.

Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533