– సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షతను, అఘాయిత్యాలను అరికట్టాలి
– మహిళలందరూ ధైర్యంగా జీవించాలి
– మహిళా సాధికారత దిశగా ప్రతి ఒక్కరూ సహకరించాలి
– అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
– మండల వ్యవసాయ శాఖ అధికారిని భవాని
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలను గౌరవించే గొప్పదినం అని నస్రుల్లాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారిని భవాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన మహిళల యొక్క ప్రాధాన్యతను, వారి త్యాగాలను గుర్తిస్తూ మహిళా దినోత్సవం జరపడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఒక పురుషుడి విజయం వెనుక ఒక తల్లి, చెల్లి, అక్క, కూతురు, భార్య …. ఇలా ఏదో ఒక రూపంలో స్త్రీ మూర్తి ఉండే ఉంటారు అని అన్నారు. వారి త్యాగాలను గుర్తిస్తూ వారి శక్తిని రెండింతలు చేసేలా సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవిస్తూ సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతికత ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ బాల్యవివాహాలు, పసికందులపై అమానుషంగా దాడులు, మహిళలను అవమానించడం పట్ల బాధను వ్యక్తం చేశారు. మహిళలు పురుషులతో సమానంగా ఉన్నత చదువులు చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని .. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను, వివక్షతను అరికట్టడానికి చదువు అనే ఆయుధం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలందరూ విపత్కర పరిస్థితులలో ఆత్మ న్యూనతకు గురికాకుండా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని జీవించాలని ఆకాంక్షించారు. మహిళలందరూ తమ లక్ష్యాలను సాధించుకోవడానికి అదేవిధంగా తమ కలలను సాకారం చేసుకోవడానికి విద్యను అభ్యసిస్తూ తోటి మహిళలను సంఘటితం చేస్తూ సమాజంలో మార్పు తీసుకురావడానికి అందరూ ఎవరికి వారే శాయశక్తులా తమ వంతు సహయ సహకారాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..